టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.


కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. 'వాల్మీకి'లో శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్ 'వెల్లువచ్చి గోదారమ్మ'ను రీమిక్స్ చేయబోతున్నారట. ఇందుకోసం గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా సెట్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. వరుణ్ తేజ్ - పూజా హెగ్డే మధ్య వచ్చే ఈ పాట కోసం వేల సంఖ్యలో బిందెలు కూడా వాడుతున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


అన్నట్లు ఈ పాట రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'దేవత' అనే సినిమాలోనిది. ఇందులో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రధ, రావుగోపాల రావు, మోహన్ బాబు తదితరులు నటించారు. ముఖ్యంగా ఈ పాట ఎంతో సూపర్ హిట్ అయింది. వేటూరి, ఆత్రేయ రాసిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. అలాగే, బాలు, సుశీల ఆలపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: