పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. అయితే, ఇటీవల ఆయన చేసిన పనితో అక్కినేని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం అక్కినేని ఫ్యామిలీ ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనిని ఆయన కుమారులు ప్లాన్ చేశారు. దీంతో నాగార్జున సహా ఆయన కుటుంబం మొత్తం వారం రోజులుగా స్పెయిన్ దేశంలోనే గడుపుతోంది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ - 3 రోజురోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ముగ్గురు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఇందులో హోస్ట్ నాగార్జున కనిపించలేదు. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇక, నాగార్జున స్థానాన్ని శివగామి దేవి అలియాస్ రమ్యకృష్ణ భర్తీ చేశారు. ‘బిగ్ బాస్ సీజన్ - 3 కోసం రాణి రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు' అని ప్రకటించింది.

తమ అభిమాన హీరో పుట్టినరోజును దగ్గరుండి జరుపుదామని భావించిన అక్కినేని అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఎంతో మంది ఫ్యాన్స్ కలిసి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిపించారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. ఇలాగే భారీ స్థాయిలో నాగ్ జన్మదినాన్ని జరపాలని అనుకున్నప్పటికీ.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వారంతా బాధ పడ్డారు.

అక్కినేని నాగార్జున పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడం వెనుక కారణం ఒకటి బయటకు వచ్చింది. గత సంవత్సరం నాగ్ జన్మదినం రోజునే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వర్ధంతి రోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం బాగోదన్న కారణంతో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందునా.. హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్న విషయం విధితమే.

గతంలో హరికృష్ణ, నాగార్జున కలిసి ‘సీతారామరాజు' అనే సినిమాలో నటించారు. ఇందులో ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించారు. ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించాడు. ఆ తర్వాత నాగ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘ఊపిరి' సినిమాలో నటించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల తారక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో కార్తిని తీసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: