జయసుధకు 'అభినయ మయూరి' అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ "ఇరవై ఏళ్ల నుంచీ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లకు అవార్డులు ఇస్తూ వస్తున్నా. ఇప్పుడు జయసుధకు 'అభినయ మయూరి' అనే అవార్డును ఇవ్వబోతున్నా. ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఎన్నో శాఖల్ని ఇముడ్చుకున్న సినిమా దేవుని సృష్టిలో చాలా గొప్ప కళ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవాళ్లు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు" అన్నారు.
ప్రస్తుతం హీరోలు ఏదైనా అవార్డు వచ్చిందంటే అది తీసుకోవడానికి చాలా నామూషీగా ఫీలవుతున్నారని అన్నారు. గతంలో సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ అలా ఎప్పుడూ చేసేవారు కాదని అన్నారు. ఇప్పటి వాళ్లు కూడా దాన్ని ఫాలో అయితే బావుంటుందని అన్నారు. ఇప్పటి హీరోలు అవార్డు తీసుకోవడానికి ఎందుకని రావడం లేదు అన్న విషయం పై కొందరిలో రకరకాల అనుమానాలు కూడా వచ్చాయి. కొందరు అలా పబ్లిక్లోకి రావడం వల్ల వాళ్ల కున్న క్రేజ్ తగ్గుద్దని భావిస్తే మరి కొందరు ఆ సమయానికి వేరే వేరే పనులు వల్ల హాజరు కాలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. సాధారణంగా ఎవరూ కూడా హాజరు కాకుండా ఉండరు.