కేజీఎఫ్..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లు సాధించింది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పిస్తున్నారు. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది.
అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కోలార్ ఫీల్డ్స్లోని సైనైడ్ హిల్స్లో షూటింగ్ జరుపుతుండగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును అష్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ గురించి ఆలోచించి షూటింగ్ను ఆపాలని ఆదేశాలిచ్చింది.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. హైదరాబాద్, బెంగుళూర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్లలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు అని తెలిపారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ ని చూపించనున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కేజీఎఫ్ గనుల పై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్న దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించబోతున్నారు. తొలిభాగంలో అమ్మ సెంటిమెంటు, నేపథ్య సంగీతంతో అందరినీ కట్టి పడేశారు. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.