వెబ్ సిరీస్ ట్రెండ్ బాగా ఊపందుకుంది. అన్నీ భాషల్లోను వెబ్ సిరిస్ లు నిర్మించడానికి దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నారు. అంతేకాదు బడ్జెట్ కూడా బాగానే కేటాయిస్తున్నారు. దీంతో పాటు స్టార్ ని ముఖ్య పాత్రలకు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓటీటీ (ఓట్ట్) వేదిక రంగ ప్రవేశంతో వినోదం తీరుతెన్నులు అనూహ్యంగా మారిపోయింది. సినిమాల్ని మించి వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతోంది. అరచేతిలోనే  మొబైల్ వినోద సాధనంగా మారిపోవడంతో ఈ వేదికకు అసాధారణ గుర్తింపు దక్కింది. వెండితెర-బుల్లితెరకు ధీటుగా నటీనటులకు ఛాన్సులు పెరుగుతున్నాయి. ఈ గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టేందుకు అగ్రహీరోలు- టాప్ హీరోయిన్లు కూడా సిద్దంగా లేరు. బాలీవుడ్ సహా సౌత్ లోనూ సమంత, జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి అగ్ర తారలు వెబ్ సిరీస్ లకు సంతకాలు చేస్తున్నారు. 

అందులో భాగంగానే శివగామి రమ్యకృష్ణ తాజాగా ఓ వెబ్ సిరీస్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. MX ఓటీటీ చానెల్ తో ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అమ్మ జయలలిత జీవితకథ ఆధారంగా గౌతమ్ మీనన్- ప్రశాంత్ మురుగేషన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు-తమిళం-హిందీ- బెంగాళీలో రిలీజ్ అవబోతోంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా జయలలిత ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. అమ్మ జయలలిత ప్రజా వేదికపై ప్రసంగిస్తుండగా తీసిన స్టిల్ అని తెలుస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించేప్పటికే జయలలిత మిడిలేజీలో ప్రవేశించారు కాబట్టి రమ్యకృష్ణ ఈ పాత్రకు యాప్ట్ అనే అభిమానులు ఫిక్సైపోయారు.  

ఇక వెండితెర-బుల్లితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా పాపులరైన రమ్యకృష్ణ వెబ్ సిరీస్ లో ఎంతవరకు రాణిస్తారు? అన్నది వేచి చూడాలి. అయితే దాదాపు అందరు రమ్యకృష్ణ ఈ వెబ్ సిరీస్ లో కూడా సత్తా చాటుకుంటుందని ధీమాగా ఉన్నారు. ఇటీవలే కింగ్ నాగార్జున స్థానంలో బిగ్ బాస్ 3కి రెండు ఎపిసోడ్లను రమ్యకృష్ణ హోస్టింగ్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు వెండితెరపై క్యారెక్టర్ నటిగానూ రమ్య బిజీబిజీగా ఉన్న విషయం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి అమ్మ బయోపిక్ సినిమా కంటే ముందే వెబ్ సిరీస్ గా బయటకు రాబతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: