ప్రముఖ సినీ గీత రచయిత ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్ను మూశారు. దాదాపు 800 పాటలకు పైగా అయన రాశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. విజయ్ సినిమా
తుళ్లాద మనం తుళ్లుం చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అందులో మెఘామాయ్ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్ పాటలు ముత్తువిజయన్కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పెన్నిన్మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్ పాట ముత్తువిజయన్ను మరింత పాపులర్ చేసింది.
రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ముత్తువిజయన్, కవయిత్రి తేన్ మొళినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సవ్యంగా సాగిన వీరి ప్రయాణం తరువాత కళ తప్పించి.. విడాకుల వరకు వెళ్ళింది. అధికారికంగా విడిపోయారు. ఆ తరువాత ముత్తువిజయన్ వలసరవాక్కంలో ఉన్న సినీ గీత రచయితల సంఘం కార్యాలయంలోనే ఉండిపోయారు.
అక్కడే ఉంటూ పాటలు రాస్తూండేవారు. అయితే, సడెన్ గా అయన పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారు. దీంతో కాలేయం చెడిపోయింది. చెన్నైలోని హాస్పిటల్ లో వైద్యచికిత్స పొందుతున్న ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. కాగా ఈరోజు సాయంత్రం ముత్తువిజయన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ముత్తువిజయన్ మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్నో కలలుకని ఆ కలల్ని నిజం చేసుకునే సమయంలో ఇలాంటి వ్యాధి బారిన పడి యువ రచయిత మరణించడం సినీ పరిశ్రమకు తీరని దెబ్బ అవుతుంది. చాలామంది రచయితలు నిత్యం పనిచేస్తూ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే వారు ఇలా మధ్యలోనే అర్ధాంతరంగా కాలం చేస్తుంటారు. పనితో పాటు కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ద వహిస్తే.. తప్పకుండా అన్ని అందరిలానే విజయం సాధిస్తారు. పోటీలో నిలిచి మెప్పిస్తారు.