ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించే 'పొన్నియన్ సెల్వన్' భారీ చారిత్రాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతుండగా, తాజాగా ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో మణిరత్నం, తరణి కలసి 'నాయకన్', 'దళపతి' చిత్రాలకు పనిచేశారు.
మణిరత్నం దాదాపు 800 కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. కల్కీ రాసిన పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇటు సౌత్, అటు నార్త్కి సంబంధించిన పలువురు స్టార్స్ ఇందులో భాగం కానున్నారని చెబుతున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహన్ బాబు, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు స్టార్స్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఏడాది చివరలో చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మొత్తం 12 పాటలని ఆయన రూపొందిస్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్లాసిక్ స్టైల్లో ట్యూన్స్ సిద్దం చేస్తున్నట్టు టాక్. కాగా మణిరత్నంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సినిమా విషయంలో మణిరత్నం తీసుకున్న ఓ నిర్ణయం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది సినీ ప్రముఖులకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే గొప్ప దర్శకుడిగా పేరొందిన మణిరత్నం తన కొత్త సినిమా `పొన్నియన్ సెల్వన్` కోసం వైరముత్తు చేత ఏకంగా 12 పాటలు రాయిస్తున్నారు. దీంతో నెటిజన్లు మణిరత్నాన్ని విమర్శిస్తున్నారు. వెంటనే వైరముత్తును సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంతోపాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను కూడా విమర్శిస్తున్నారు.