తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేవలం తమిళనాట మాత్రమే కాక, మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మొన్న ఆ మధ్య ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాల పాలయినప్పటికీ, ఇటీవల ఆయన నటించిన 2.0 మరియు పెట్టా చిత్రాలు మంచి సక్సెస్ లు సాధించి, కెరీర్ పరంగా రజినీకి మంచి జోష్ ని ఇచ్చాయి. ఇక అదే ఊపుతో ప్రస్తుతం, మాస్ కథలను మంచి మెసేజితో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించ గల దిట్టగా పేరుగాంచిన ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో రజిని నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై మంచి అంచనాలు పెంచింది. 

ఇక నేడు ఓనం పండుగను పురస్కరించుకుని సినిమా యూనిట్, మరొక సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. రజినీకాంత్ ఊర మాస్ లుక్ లో బ్లాక్ కలర్ బనియన్ వేసుకుని రాడ్ పట్టుకుని ఉన్న ఆ పోస్టర్ ని చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఇక ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. రజినీకాంత్ ఒక మాస్ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, నివేత థామస్ మరొక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. 

గతంలో రజినీతో పెట్టా వంటి మ్యూజికల్ హిట్ ని అందించిన అనిరుద్ రవిచందర్, మరొక్కసారి ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ని అందిస్తున్నాడు. సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో యోగిబాబు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, తంబి రామయ్య, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈ సినిమాను 2020 పొంగల్ కానుకగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: