తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బిగిల్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈఏడాది సైరా తరువాత సౌత్ లో విడుదలకానున్న పెద్ద సినిమా ఇదే. దాంతో ఈ చిత్రంఫై తమిళ , తెలుగు భాషల్లో మంచి అంచనాలు వున్నాయి.తమిళనాడు లో ఈచిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.
కాగా ఇటీవల విజయ్ నటించిన సర్కార్ తెలుగులో కమర్షియల్ గా సక్సెస్ కావడంతో బిగిల్ తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఇక తాజాగా ఈహక్కులను ఎన్టీఆర్ పిఆర్ఓ ,ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత, నా నువ్వే , 118 చిత్రాల నిర్మాత మహేష్ ఎస్ కోనేరు గట్టి పోటీ నడుమ దక్కించుకున్నారు. అయితే ఈ చిత్రం అదే టైటిల్ తో తెలుగులో విడుదలవుంతుందో లేక టైటిల్ మారుస్తారో చూడాలి. తెలుగులో ఈచిత్రం 400స్క్రీన్లలో విడుదలకానుండడంతో తన మార్కెట్ ను విస్తరించుకోవడానికి విజయ్ కి ఇది మంచి అవకాశం.
భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 24 న లేదా 25 న కానీ విడుదలకానుంది. విజయ్ -అట్లీ కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తెరి , మెర్సల్ సూపర్ హిట్లు అయ్యాయి. ఇక బిగిల్ ఆడియో వేడుకను ఈనెల 19న గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం.