టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా చిన్నప్పుడే సినిమాల్లో నటించడం మొదలెట్టారు. అప్పట్లో అనేక చిత్రాల్లో బాలనటుడిగా నటించి, ప్రేక్షకుల మనసు గెలిచిన మహేష్, చివరిగా బాలచంద్రుడు అనే సినిమాతో బ్రేక్ ఇచ్చారు. అయితే అంతక ముందు కృష్ణ, విజయశాంతిల కలయికలో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో వారి కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటించిన మహేష్, అప్పటి రోజులను గుర్తుచేస్తూ నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. 

'అప్పుడెప్పుడో 1989లో దాదాపుగా 30 ఏళ్ళ క్రితం విజయశాంతి గారితో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించి స్క్రీన్ షేర్ చేసుకున్నాను, మళ్ళి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఆమెతో కలిసి నటిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది, అప్పుడు ఆమెతో కలిసి మొదలైన ప్రయాణం ఇప్పటివరకు సర్కిల్ లా తిరుగుతూ వచ్చింది' అంటూ అయన పోస్ట్ చేసారు. ఇక తన పోస్ట్ లో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ఆమెతో కలిసి షూటింగ్ స్పాట్ లోని ఒక ఫోటోని షేర్ చేసారు మహేష్. కాగా మహేష్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తండ్రి కృష్ణ గారి వలె పెద్దలకు గౌరవం ఇవ్వడంలో మహేష్ అందరికంటే ముందుంటారని, 

అందుకే ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యారని మహేష్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు సైతం సూపర్ స్టార్ పై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: