అక్కినేని వారి నటవారసుడు అఖిల్, ఇప్పటివరకు కెరీర్ పరంగా నటించిన మూడు సినిమాలు కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగింది. తొలి సినిమా అఖిల్ నుండి మొన్నటి మజ్ను వరకు తన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదిస్తున్న అఖిల్, సినిమాల పరంగా మాత్రం సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. అందుకే తన తదుపరి నాలుగవ సినిమాకోసం పలువురు దర్శకుల నుండి కథలు వింటూ చాలానే సమయం తీసుకున్నాడు అఖిల్. 

ఇక ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైన ఆయన నాలుగవ సినిమాను, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరుగుతోంది. ఈ సినిమలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకుంటున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఇక నేడు ఈ విషయమై సినిమా యూనిట్, హీరోయిన్ గా పూజనే సెలెక్ట్ చేసినట్లు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉండనున్నట్లు టాక్. 

యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఓ వైపు అఖిల్, మరోవైపు భాస్కర్ లకు ఎప్పటినుండో సరైన సక్సెస్ లేకపోవడంతో, ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ ని తమ ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి రావాలని చూస్తున్నారట. ఇక ఇటీవల అరవింద సమేత, మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పూజ హెగ్డే, ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించడంతో, ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని వార్త ప్రచారం అవుతోంది. మరి ఆ విషయం అటుంచితే, ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్, భాస్కర్ లు ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం, ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: