మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న చారిత్రాత్మక సినిమా సైరా. 1800 కాలానికి చెందిన స్వాతంత్ర యోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై గొరిల్లా పోరాటం చేశారు. ఆ పోరాటంలో అయన చివరకు బలయ్యారు.
చరిత్ర మర్చిపోయిన వీరుడి కథను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాపై భారీ నమ్మకం ఉన్నది. ఈనెల 18 వ తేదీన ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నది. ఈ ఈవెంట్ కు రాజమౌళి, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరవుతున్నారు. ఈ ఈవెంట్ తరువాత ప్రమోషన్స్ భారీ ఎత్తున జరగబోతున్నాయి.
ఇక ఇదిలా ఉంటె, సైరా సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే నిండి ఉంటుంది. పోరాట సన్నివేశాల నుంచి చాలా వరకు సినిమాలో గ్రాఫిక్స్ ను పెట్టారు. గ్రాఫిక్స్ చిన్న పిల్లల గ్రాఫిక్స్ లా కాకూండా, వీడియో గేమ్ లా కాకూండా రియలిస్టిక్ గా కనిపించే విధంగా డిజైన్ చేస్తున్నారు. దీనికోసం దాదాపుగా రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. గ్రాఫిక్స్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేసారంటే మాములు విషయం కాదు. దాదాపు ఐదు దేశాల్లో ప్రముఖు గ్రాఫిక్ డిజైనర్ల పర్యవేక్షణలో సైరా గ్రాఫిక్స్ రూపుదిద్దుకుంటున్నాయి.
టీజర్ ఓ శాంపిల్ మాత్రమే.. ట్రైలర్ లో చాలా చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమా రిలీజ్ కు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని పూర్తిగా ప్రమోషన్స్ కోసమే వినియోగిస్తారని సమాచారం. 152 వ సినిమా హడావుడి ఉన్నా సైరా పూర్తయ్యాకే దాని జోలికి వెళ్లాలని మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా అయన పనిచేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటించారు.