టెక్నీషియన్లు తెరవెనుకే ఉంటారు. ఎప్పుడో ఓసారి గానీ వారు తెరమీదకి రారు. అలా తెర మీద కనబడిన దర్శకులు చాలా మందే ఉన్నారు. కొందరు వారు దర్శకత్వం చేసిన సినిమాల్లో కనిపిస్తే, మరికొందరు తమ స్నేహితులు దర్శకత్వం చేసిన సినిమాల్లో కనిపిస్తారు. తాజాగా  టాప్ దర్శకుడు సుకుమార్ తెరమీద కనబడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కనిపించడమే కాకుండా కామెడీని కూడా పండించాడు.


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "గ్యాంగ్ లీడర్" నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ చిత్రంలో నాని రైటర్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అతను హాలీవుడ్ సినిమాల్ని చూసి డిట్టో దించేస్తూ నవలలు రాస్తుంటాడు.


కానీ అనుకోకుండా ఐదుగురు ఆడవాళ్ల రివెంజ్‌లో భాగమై.. వాళ్లతో జర్నీనే కథగా మలుస్తాడు. ఇది దర్శకుడైన సుకుమార్ కళ్లలో పడి.. దాని ఆధారంగా సినిమా తీయాలనుకుంటాడు. ఇలా కొసమెరుపులా సినిమాలో సుక్కు ఎంట్రీ ఉంటుంది. సినిమా చివర్లో సుకుమార్ తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని  పరిచయం చేసుకుంటాడు. దానికి నాని  తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అంటాడు.


థియేటర్ లో ఈ సీన్ బాగా పేలింది. ముగింపులో ప్రేక్షకులు నవ్వుతూ థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేసింది. సుకుమార్ నటుడిగా కనిపించిన తొలి సినిమా ఇదే. రంగస్థలం చిత్ర నిర్మాతలు తెరకెక్కించిన చిత్రం కావడంతో అందులో నటించడానికి సుకుమార్ ఒప్పుకుని ఉంటాడని అనుకుంటున్నారు. అలాగే వరుణ్ తేజ్ నటించిన "వాల్మీకి"సినిమాలో కూడా సుకుమార్ కనిపించబోతున్నాడట. వాల్మీకి సినిమా ఈ నెల సెప్టెంబరు ౨౦ వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: