మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. 1982లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్బాబు, శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మా' పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఈ పాటను సెప్టెంబర్ 17న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ''పాటలు, డ్యాన్స్ నాకు కంఫర్ట్ జోన్ కాదు. హరీష్గారు ఈ సినిమా కథ చెప్పి ఒక రీమిక్స్ సాంగ్ ఉంది అన్నారు. నేను మా ఫ్యామిలీలో ఎవరి పాట ఉంటుందో అనుకున్నాను. శోభన్బాబు, శ్రీదేవిగారి పాట అనగానే చాలా ఎగ్జయిట్గా అన్పించింది. చాలాసార్లు మా నానమ్మ, నాన్నగారు ఈ పాట వింటం నేను చూశాను. అదే పాటను అంతే అమేజింగ్గా రీక్రియేట్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ బిగ్ థాంక్స్. నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి వీరాభిమానిని. 'ముకుంద' సినిమాలో ఆయనతో ఒకసారి పాడించాలని నేను, మిక్కీ అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన ఈ పాట మళ్లీ పాడటం మా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం రాఘవేంద్రరావుగారి సినిమాలు, పాటల వైభవం అలాగే ఉంటుంది. శోభన్బాబుగారు డ్యాన్స్ చేసిన షూ నేను వేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీదేవి, శోభన్బాబు అంత కాకపోయినా మా పరిధిమేరకు డ్యాన్స్ చేశాం'' అన్నారు.