బాలీవుడ్ లో బయోపిక్స్ రావడం కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురి ప్రముఖుల మీద తీసిన బయోపిక్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడమే కాదు మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే కొన్ని బయోపిక్స్ మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకుండా జనాలు గుర్తు పెట్టుకోకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అదే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్. ఇప్పటికే మోడీ జీవితకథ ఆధారంగా కొన్ని సినిమాలు ప్రతిపాదనలోకి వచ్చాయి. వాటిల్లో ఒకటి విడుదల అయ్యింది కూడా. మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించిన ఆ సినిమా ఎన్నికల సమయంలో విడుదల అయి ప్రేక్షకుల్లో ఏ రకంగానూ ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. అంతేకాదు విమర్శలపాలయ్యింది కూడా.

మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ లుక్కే ఎవరికీ నచ్చినట్టుగా లేదు. ఎన్నికల్లో అయితే మోడీ మళ్లీ నెగ్గారు కానీ, ఆ బయోపిక్ మాత్రం గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా మోడీ జీవిత కథ ఆధారంగా వస్తోందట. దీని పేరు 'మన్ బైరాగి'. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం విశేషం. బాలీవుడ్ లో భారీ సినిమాకు కేరాఫ్ గా నిలిచిన వ్యక్తి సంజయ్ లీలా భన్సాలీ. అలాంటి ప్రొడ్యూసర్ పేరు ఈ సినిమా విషయంలో వినిపిస్తుండటంతో.. ఈ సినిమా కూడా భారీగానే ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ లో బాల నరేంద్రమోడీ కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇద్దరు హీరోలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టుచేయడం ఆసక్తికరంగా మారి చర్చలకు దారి తీసింది. ఆ హీరోలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు హీరోలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోడీ బయోపిక్ ను సోషల్ మీడియాలోకి రిలీజ్ చేశారు.
అక్షయ్ కుమార్ కొన్నేళ్లుగా బీజేపీకి అతి సన్నిహితుడుగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీ నేత అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ హీరోల ఖాతాల నుంచి మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: