టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సరసన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క, తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత మెల్లగా వచ్చిన ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని దూసుకెళ్లిన అనుష్క, కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించి అనుష్కకు విపరీతమైన పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడినుండి టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలతో నటించిన అనుష్క, ప్రస్తుతం నటిస్తున్న వెరైటీ మూవీ నిశ్శబ్దం. 

హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాక్షి అనే ఒక మూగ ఆర్టిస్ట్ పాత్రలో అనుష్క నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.  కాగా ఈ సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ చాలా బాగా వచ్చాయని, అవి ఈ సినిమాకి పెద్ద హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ మరియు కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు సినిమాకి ఎంతో పెద్ద ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. ఇక మాధవన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటించనున్నాడట. సినిమాలో అనుష్క మరియు మాధవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. 

ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఇంకా ఈ సినిమాలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రచయిత కోన వెంకట్ బ్యానర్‌, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఇప్పటివరకు పలు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకులను అలరించిన జేజమ్మ, ఈ సినిమాలోని సాక్షి పాత్రతో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: