స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మూవీ ‘గద్దలకొండ గణేష్’. ఈ మూవీకి మొదట ‘వాల్మీకి’ అని ఫిక్స్ చేసి పబ్లిసిటి కూడా బాగా చేశారు. కానీ, వాల్మీకి చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వాల్మీకి, బోయ సామజిక వర్గ ప్రజలు ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్ర యూనిట్ ప్రమోషన్ చేస్తూ వచ్చారు.
కర్నూలు, అనంతపురం రెండు జిల్లాలో బోయ సామజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. దాంతో అక్కడ ఈ మూవీ రిలీజ్ అయితే పెద్ద ఎత్తున అల్లర్లు జరగుతాయని వార్తలు వచ్చాయి. దీనితో ఈ రెండు జిల్లాల ఎస్పీలు చిత్ర విడుదలని నిలిపివేస్తూ థియేటర్స్ యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు. ఈ చిత్ర విడుదలని అడ్డుకుంటూ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
దీనితో ఈ రెండు జిల్లాలో వాల్మీకి మూవీ విడుదలకు బ్రేక్ పడింది. ఇక భద్రతా కారణాల రీత్యా ఆ రెండు జిల్లాలో విడుదలకు బ్రేక్ పడటంతో రక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా కంటెంట్ చూసి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో కొందరు నిరసన తెలుపుతున్నారని ఏకంగా విడుదలనే అడ్డుకోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
ఏపీ హైకోర్టు నుంచి తమకు అధికారిక ఆదేశాలు ఇంకా అందలేదనీ, అందుకే సినిమాను ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. దీంతో కర్నూలులో ఈ సినిమా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయమై అస్పష్టత నెలకొంది. కాగా, వరుణ్ తేజ్, హరీష్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ మూవీకి మద్దతు తెలుపుతున్నారు.