మెగా హీరోలను వివాదాలు వదలడం లేదు. మొన్నటి వరకు వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి... ఇంకొన్ని రోజులలో విడుదల కాబోతున్న సైరాకు ఈ రెండు సినిమాలకు మొదటినుంచే వివాదాలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు పేరు మార్చుకుని వాల్మీకిని గద్దలకొండ గణేష్ గా మార్చి వరుణ్ తేజ్ హిట్ కొట్టాడు. అయితే కొన్ని రోజులలో విడుదల కాబోతున్న సైరాకు మాత్రం వివాదాలు సమస్యగా మారనున్నాయి. మెగాస్టార్ తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాని మొదలుపెట్టినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదల ఆపి వేయాలంటూ ఉయ్యాలవాడ వారసులు నిరసన తెలుపుతున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చిరంజీవి ఆఫీస్ ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉయ్యాలవాడ వారసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... చిరంజీవి, రామ్ చరణ్ సహా సైరా నరసింహారెడ్డి చిత్ర బృందం పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా విడుదలను నిలిపివేయాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు కోర్టులో విచారణ జరగనుంది.
కాగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. అయితే ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే మొదటి పీరియాడికల్ మూవీ కావడం... భారీ బడ్జెట్ తో రూపొందించటం తో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సినిమా విడుదల కోసం... మెగా అభిమానులే కాదు తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదలవుతుండగా ... తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా జరువుకుంది చిత్రబంధం.