బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆషికి 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్, నటించిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు, నటిగా కూడా మంచి పేరు సంపాదించింది. తండ్రి శక్తి కపూర్ నట వారసురాలిగా అడుగుపెట్టిన శ్రద్ధకు ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అక్కడినుండి పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన శ్రద్ధ కపూర్, ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా సౌత్ సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి, 

బాక్సాఫీస్ వద్దగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే సౌత్ లో ఆ సినిమా చాలావరకు దెబ్బతిన్నప్పటికీ, అటు నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్స్ ని రాబట్టడం జరిగింది. కాగా సాహో సినిమా అక్కడ రూ.150 కోట్ల మేర కలెక్షన్ ని రాబట్టి మంచి రికార్డుని నెలకొల్పింది. ఇకపోతే ఇటీవల ఆమె నటించిన మరొక బాలీవుడ్ సినిమా చిచ్చోరె కూడా రిలీజ్ అయి, ప్రస్తుతం సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాకి దంగల్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించారు. 

ఈనెల 6న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రు.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనితో శ్రద్దా కపూర్ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సాధించిన సినిమాల్లోనటించినట్లైంది. ఈ విధంగా ఆమె వరుసగా రెండు సెంచరీలు కొట్టడంతో ఆమె ఫ్యాన్స్ అమితానందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న స్ట్రీట్ డాన్సర్ మరియు టైగర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న భాగి 3 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో తనకు సౌత్ సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను అంటోంది ఈ ముద్దుగుమ్మ....!!


మరింత సమాచారం తెలుసుకోండి: