వెంకటేష్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 34 సంవత్సరాలు దాటిపోతున్నా ఎప్పుడు అతడి గురించి నెగిటివ్ వార్తలు కానీ గాసిప్పులు కానీ బయటకు రావు. తన సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత బయట ఎక్కువగా వెంకటేష్ కనిపించడు. అయితే అలాంటి వెంకటేష్ కు గుర్రపు పందాల పిచ్చి ఏర్పడి ఆ రంగంలో ఉండే నెగిటివ్ కోణాలను బయటకు తీసే ఒక యదార్ధ పాత్రలో వెంకీ నటించబోతున్నాడు. 

తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మలక్ పేట్ హార్స్ రేడింగ్ క్లబ్ మ్యానియా నేపధ్యంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని అల్లిన కథకు వెంకటేష్ ఓకె చేసినట్లు టాక్. ఈ మూవీని సురేష్ బాబు నిర్మించబోతున్నాడు. గుర్రాలు అన్నా గుర్రపు పందాలు అన్నా విపరీతంగా మోజు ఉండే ఒక జాకీ పాత్రలో వెంకటేష్ నటిస్తూ ఆ రంగంలో ఉన్న నెగిటివ్ కోణానికి సంబంధించిన యదార్ధ సంఘటనలు ఈ మూవీలో చూపించబోతున్నట్లు టాక్. 

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీలో జాకీ పాత్రను చేయబోయే వెంకటేష్ గుర్రపుస్వారీని నేర్చుకోవడం కోసం రోజుకు రెండు గంటలు కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒకేసారి క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఆతరువాత తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫ్లాప్ కావడంతో తన క్రేజ్ పోగొట్టుకున్నాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న ‘మీకు మాత్రమే చెపుతా’ మూవీలో తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం కొనసాగుతూ ఉండగానే వెంకటేష్ మూవీ కోసం తరుణ్ భాస్కర్ ఈ వెరైటీ కథను ఎంచుకున్నాడు. వాస్తవానికి మలక్ పేట్ హార్స్ రేడింగ్ క్లబ్ కు వెంకటేష్ అల్లుడి తాత అధ్యక్షుడుగా కీలక పాత్ర నిర్వర్తిస్తున్నాడు. అలాంటి మలక్ పేట్ హార్స్ రెడింగ్ విషయాల నేపధ్యంలో ఇప్పుడు వెంకీని హీరోగా చేసి ఒక సినిమా రావడం యాధృశ్చికం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: