మాస్ కథా చిత్రాలకు మారుపేరైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, అంతకముందు కొన్నేళ్ల నుండి సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో కొందరు హీరోలు అయితే కథ వినిపిస్తాను రమ్మంటారా సార్ అని అడిగినపుడు, వాళ్ళ నుండి సరైన సమాధానం కూడా రాలేదని ఇటీవల చెప్పుకొని వాపోయారు పూరి. అయితే మొత్తానికి ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ రూపంలో మంచి సూపర్ హిట్ తగిలి, ఆయనకు మళ్ళి ఆఫర్స్ మొదలయ్యాయని చెప్పాలి. 

ఇక అదే ఊపులో ఇస్మార్ట్ కు సీక్వెల్ అతి త్వరలో చేస్తానని మాటిచ్చిన పూరి, తన తదుపరి సినిమాను రౌడీ హీరో విజయ్ దేవరకొండతో అనౌన్స్ చేసి, అందరికీ షాక్ ఇచ్చారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ, పూరి మార్క్ స్టైల్, మరియు డైలాగ్స్ తో ఏవిధంగా అదరగొడతారో చూడాలని విజయ్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా వారి కాంబో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విషయం అటుంచితే, మరొక రెండు రోజుల్లో తన బర్త్ డే ని జరుపుకోబోతున్న పూరి, ఆ రోజున తన నుండి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉటుందని, నిన్న తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరచడం జరిగింది. 

అయితే ఆ సర్ప్రైజ్ ఇదేనంటూ నేడు ఒక వార్త కొన్ని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ వంటి మాస్ సినిమాను తీసిన పూరి, ఆయనతో కలిసి చేయబోయే మరొక కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వార్త రెండు రోజులుగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై నేడు కొందరు పూరి సన్నిహితుల నుండి కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరొక రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: