కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల, తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆ సినిమాను దిల్ రాజు నిర్మించగా, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఇక దాని తరువాత శ్రీకాంత్ కు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ లను దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రూపంలో ఎన్నో ఏళ్ల తరువాత టాలీవుడ్ లో నిజమైన మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. 

అయితే ఆ రెండు సినిమాలు ఇచ్చిన మంచి ఊపుతో, శ్రీకాంత్ కు తన కుమారుడు వరుణ్ తేజ్ తో డెబ్యూ సినిమా చేసే అవకాశం కల్పించారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఆ అవకాశాన్ని మాత్రం శ్రీకాంత్ సరిగ్గా నిలబెట్టుకోలేకపోయారు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ తనతో సీతమ్మవాకిట్లో వంటి మంచి సినిమా చేసారు అనే నమ్మకంతో శ్రీకాంత్ కు మరొక్క అవకాశం ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్. ఇక ఆ విధంగా వారిద్దరి కలయికలో తెరకెక్కిన సినిమానే బ్రహ్మోత్సవం. భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఎంతో ఖర్చుతో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, అప్పట్లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ డిజాస్టర్ ప్రభావంతో అప్పటినుండి ఇప్పటివరకు శ్రీకాంత్ కు మరొక్క సినిమా చేసే అవకాశం రాలేదు. 

అయితే ప్రస్తుతం కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు శ్రీకాంత్ తన తదుపరి సినిమా కోసం గతంలో తాను తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాదిరి మంచి ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ ఒకటి తయారు చేసారని, అతి త్వరలోనే ఆ కథను ఒక బడా నిర్మాతకు వినిపించి, అనంతరం దానిని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: