ఒకటి కాదు రెండు కాదు ఏ మూహూర్తంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ మొదలు పెట్టారో..అప్పటి నుంచి ఎన్నో వివాదాలు, అడ్డంకులు, అవరోదాలు ఎదురవుతూనే ఉన్నాయి. షూటింగ్ సమయంలో పరిమిషన్ లేదని హైదారాబాద్ జీహెచ్ఎంసీ అడ్డు చెప్పింది. మరికొద్ది రోజుల తర్వాత సైరా షూటింగ్ కాలిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో వివాదం చెలరేగింది..అవన్నీ దాటుకొని కూల్ గా షూటింగ్ జరుపుకుంటూ..మొత్తానికి ‘సైరా’ కంప్లీట్ చేసుకొని అక్టోబర్2 న గాంధీజయంతి సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.
ఇంతలోనే మరో వివాదం ‘సైరా’ కి తలనొప్పిగా మారింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వంశీయులు తమకు చిత్ర యూనిట్ కొంత డబ్బు ఇస్తామని అందుకే ఆయన కథ వారికి చెప్పామని..కానీ ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదని పోలీస్ కేసు కూడా పెట్టారు. అక్టోబరు 2న విడుదల తేదీ ప్రకటించాక.. మా పెద్దాయన జీవితచరిత్ర తప్పుగా తీశారంటూ ఖేతిరెడ్డి అనే ఉయ్యాలవాడ సమితి అధ్యక్షుడు హైకోర్టును ఆశ్రయించాడు. అంతే కాదు తమకు చిరు అండ్ చరణ్ అన్యాయం చేశారంటూ పోలీసుస్టేషన్ మెట్లెక్కిన విషయం తెలిసిందే.
అయితే ఇది ఎవరు, ఎందుకు చేయిస్తున్నారు అన్న విషయాన్ని పక్కనబెడితే..ఒక స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్రను కోట్ల మందికి పరిచయం చేయాలన్న సంకల్పంతో చిత్ర యూనిట్ ఉంటే ఇలా రచ్చ చేయడం ఎంత వరకు న్యాయం అని మరికొందరు అంటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటుల సరసన తనకూ ఓ స్థానం దక్కించుకున్న మెగాస్టార్ ఎదుగుదల ఎవరికి కంటగింపుగా ఉంది.. ఎందుకీ తెరచాటు రాజకీయం చేస్తున్నారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.