దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. 29న ఆదివారం నోవాటెల్ హోటల్ల్లో అతిరధుల సమక్షంలో ఈ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్కు ఇది 17వ వార్షికోత్సవం కావడం విశేషం. ఈ సందర్భంగా నటి జమునకు కూడా ఒక అవార్డును అందజేశారు. ఇండస్ట్రీకి వచ్చి 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్నటిగా ఆమెను గౌరవించి ఆమెకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నటి జమున మాట్లాడుతూ.. ముందుగా ఈ వేదిక మీద ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఒకటుంది. నేను ఓ సీనియర్ నటిగా నాకు ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే అర్హత ఉందని భావిస్తున్నాను. ప్రస్తుతం వచ్చే యువ హీరోలుగాని, హీరోయిన్లుగాని దయచేసి ఫంక్షన్లకు వచ్చేటప్పుడు బౌన్సర్లను పెట్టుకోవద్దు అని ఆదేశించారు. వాళ్ళు సీనియర్ యాక్టర్లన్న కనీస గౌరవం కూడా లేకుండా మమ్మల్ని తోసేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చాలా బాధపడ్డారు. అప్పట్లో మేం హీరోయిన్లగా ఉన్నప్పుడు కూడా అభిమానులు వచ్చేవారని కాని ఎప్పుడూ ఎన్టీఆర్గారుకాని, అక్కినేనినాగేశ్వరావుగారు కాని ఎప్పుడూ ఫంక్షన్లకు ఒంటరిగా ఒక్కరే వచ్చేవారని ఎప్పడూ చుట్టూ ఎవ్వరూ ఉండేవారు కాదని అన్నారు. దయచేసి పెద్దవారిని గౌరవించమన్నారు. బౌన్సర్లను మాత్రం పెట్టుకోవద్దని చాలా గట్టిగానే ఆదేశించారు. ఒక సీనియర్ నటిగా, వయసులో పెద్దదానిగా, వృద్ధురాలిగా నా మాటకు విలువనిస్తారని భావిస్తున్నాను అన్నారు.
అలాగే తమ కాలంలో సామాజిక అంశాలు, కుటుంబ విశేషాలు, ప్రజాసమస్యలు, రాజకీయాల్లో కుళ్లుపై ప్రజలకు అవగాహన కల్పించేలా సినిమాలు తీసేవారని గుర్తు చేశారు.
తన స్వగ్రామం దుగ్గిరాల అని, హాంపీలో పుట్టి పెరగడంతో హాంపీ సుందరిగా పిలిచేవారని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.