చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం తెలుగు ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి లుక్, ఆయన చేసిన యాక్షన్ అందరిని కట్టిపడేసింది. ఈ ఏజ్ లో కూడా చిరంజీవి ఇరగదీశాడు అంటూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందించబడి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన ఈ సినిమాపై... వివాదాలు కూడా భారీగానే ఉన్నాయి. మొన్నటి వరకు నరసింహారెడ్డి వారసులు సైరా సినిమాను విడుదలను అడ్డుకుంటామని నిరసన తెలుపగా... ఈ విషయమై కోర్టులో కేసు కూడా వేశారు ఉయ్యాలవాడ వారసులు.
అయితే ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ వారసులతో సైరా చిత్రబృందం కలిసి మాట్లాడిన విషయం కూడా తెలిసిందే. అయితే సైరా సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాను కొత్త కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సినిమా పై వేసిన కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఈ సినిమాపై మరో వివాదం చెలరేగింది. వడ్డెర సంఘం నేతలు సైరా సినిమా విడుదలను అడ్డుకుంటామని నిరసనకు దిగారు. నరసింహారెడ్డి ముఖ్య అనుచరుడైన ఓబన్న పాత్ర లేకుండానే సినిమాను ఎలా తెరకెక్కిస్తారని... నరసింహా రెడ్డి తో పాటు ఆయన అనుచరుడు వడ్డెర ఓబన్న కూడా బ్రిటిష్ వాళ్లకు ఎదురొడ్డి పోరాడారని వడ్డెర సంఘం నేతలు తెలిపారు.
అయితే ఈ మేరకు నిరసన తెలిపిన వడ్డెర సంఘం నేతలు నరసింహా రెడ్డి అనుచరుడుగా బ్రిటిష్ వాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వడ్డెర ఓబన్న పాత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ... హైకోర్టులో పిటిషన్ వేశారు వడ్డెర సంఘం నేతలు . గోపన్న పాత్రను రాజు పాండే అనే పాత్రలతో భర్తీ చేశామని చెబుతున్న చిత్రబృందం...నరసింహ రెడ్డి జీవితంలో లేని పాత్రను సృష్టించి చరిత్రను వక్రీకరించిందని ఆరోపించారు. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని వడ్డెర సంఘం నేతలు హెచ్చరించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకి రోజుకో వివాదం తెర మీదికి వస్తూనే ఉంది. కాగా అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు తెలుగు ప్రజలు కూడా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.