2.ఓ వంటి హాలీవుడ్ స్థాయి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శంకర్-యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో శరవేగంగా జరుగుతోంది. కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ కి పోటీగా నటించే ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ ని వెతుకుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా అనిల్ కపూర్ పేరు బాగా వినిపించింది.

అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తారని చెప్పుకొచ్చారు చిత్ర బృందం. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. పైగా అనిల్ కపూర్ చెన్నై వెళ్లినప్పుడు శంకర్ ను కలవడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరింది. కానీ తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం. 

అనిల్ కపూర్ తన ప్రమోషనల్ ఈవెంట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారట, అంతేకానీ సినిమా కోసం కాదని తెలుస్తోంది. అంటే గతంలో కమల్ చెప్పినట్టు 'ఇండియన్ 2' లో ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తారన్నమాట వాస్తవమని అర్థమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2020 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు 23 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారన్న అన్న విషయం తెల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: