'యంగ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - సూపర్ స్టార్ మహేష్ బాబు' కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దసరా వెకేషన్ కి వెళ్లారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75శాతం పూర్తి అయిందట. అరె మహేష్ అప్పుడే అంత పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పోరాటాలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చింది. ఇక కేవలం కొన్ని సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ చేయాల్సి వుంది. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది బండ్ల గణేషేనట. ఒకరకంగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్, అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో... ఈ సినిమాలో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట. ఇక బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది.
ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే రైలు సీక్వెన్స్ సినిమాలోనే చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.