ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేసిన పీవీపీ మరియు బండ్ల గణేష్ మధ్య రెండు సంవత్సరాల నుండి 7 కోట్ల రూపాయల ఫైనాన్స్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది. బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. 
 
జూనియర్ ఎన్టీయార్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా 2015 సంవత్సరంలో టెంపర్ సినిమా విడుదలైంది. ఈ సినిమా సమయంలో పీవీపీ బండ్ల గణేష్ కు 7 కోట్ల రూపాయలు ఫైనాన్స్ ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని పీవీపీ చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పీవీపీ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిన్న రాత్రి బండ్ల గణేష్ మరియు అతని అనుచరులు పీవీపీ మరియు అతని కుటుంబ సభ్యులను బెదిరించినట్లు తెలుస్తోంది. 
 
బండ్ల గణేష్ బెదిరించటంతో ఈ విషయం గురించి పోలీసులకు పీవీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బండ్ల గణేష్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. పోలీసులు బండ్ల గణేష్ ఇంటికి మరియు ఆఫీస్ కు వెళ్లగా బండ్ల గణేష్ అక్కడ పోలీసులకు దొరకలేదు. ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం బండ్ల గణేష్ కొరకు ప్రత్యేక టీమ్ నియమించారని తెలుస్తోంది. 
 
బండ్ల గణేష్ నిర్మాతగా 2015 లో విడుదలైన టెంపర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీయార్ కు ఈ సినిమా ఫలితం భారీగా రిలీఫ్ ఇచ్చింది. ఎన్టీయార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేకై అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: