పోలీస్ యూనిఫాం వేసుకుంటే మహేష్ దూకుడు ఎలా ఉంటుందో పోకిరి, దూకుడు, ఆగడు సినిమాలలో చూశాము. ఈసారి అంతకంటే మరింత దూకుడుగా కనిపిస్తారని తెలుస్తోంది. మహర్షి వంటి క్లాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ చేస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా పూజా హెగ్డే ఒక ముఖ్య పాత్రలో సూపర్ స్టార్ కి జోడి కడుతోంది. ఇక ఈ సినిమా పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా  ఆకట్టుకుంటుంది. 

బార్డర్ లో తుపాకి పట్టి యుద్దం చేయడం.. ఊళ్లోకొస్తే గొడ్డలితో వేటాడటం చూస్తుంటే మాంచి మాస్ ఎంటర్‌టైనర్ గా అనిపిస్తుంది సరిలేరు. 2020 సంక్రాంతి టార్గెట్ గా చిత్ర యూనిట్ శరవేగంగా ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేసినట్టు తాజా సమాచారం. ఇక ఇంతక ముందు మిలటరీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ రివీల్ చేయగా ఆర్మీ మేజర్ లుక్ లో మహేష్ గెటప్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విజయ దశమి సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తు కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి విలన్ ని వేటాడుతున్నట్టుగా మహేష్ గా కనిపిస్తున్నాడు. 

కాశ్మీర్ నుంచి వచ్చిన సైనికుడికి కర్నూల్లో పనేంటో త్వరలో టీజర్ ద్వారా రివీల్ చేస్తారేమో చూడాలి. ఇటీవల కొండారెడ్డి బురుజు దగ్గర భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించారు చిత్ర యూనిట్. యాక్షన్.. కామెడీతో దూకుడు సినిమా తరహాలో అలరిస్తుందని ఇప్పటికే దర్శకుడు అనీల్ రావిపూడి వెల్లడించారు. ఇక ఈ సినిమాతో పోటీగా సంక్రాంతి బరిలో దిగడానికి అల్లు అర్జున్ కూడా సై అంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతోంది. అందుకే ఎక్కువ ఫోకస్ ఈ రెండు సినిమాల మీదే ఉంది. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే  ఈ రెండు సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: