టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా అతడు. 2005 వ సంవత్సరంలో మహేష్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం వీరిద్దరి కలయికలో 2010లో మంచి అంచనాలతో తెరకెక్కిన సినిమా ఖలేజా. అప్పట్లో విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ని రుజువు చేస్తూ, ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం అదరగొట్టింది. 

ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా, అందులో తొలిసారి తనలోని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని బయటకు తీసి, ఎంతో సహజంగా ఆకట్టుకునేలా నటించిన మహేష్ బాబు పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఇక త్రివిక్రమ్ మార్క్ పంచెస్ ని మహేష్ చెప్తుంటే థియేటర్స్ లో వచ్చే ఆ కిక్కే వేరని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా డైలాగ్స్ కు ఎంతో పేరు రావడం జరిగింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని సమస్యల కారణంగా మధ్యలో హీరోయిన్, సంగీతం, ఫైట్స్, లొకేషన్స్, కెమెరా మ్యాన్ తదితర విషయాలు కొంత మార్పులు జరిగిన కారణంగా షూటింగ్ పలు మార్లు వాయిదా పడడం వంటివి ఈ సినిమా పరాజయానికి కారణంగా అప్పట్లో సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. 

మహేష్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సునీల్ మంచి కామెడీ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలోని సదాశివ సన్యాసి అనే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ సాంగ్ గా నిలిచింది. ఇకపోతే నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా పై పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సంబరాన్ని పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్స్ మరియు లైక్స్ తో వైరల్ చేస్తూ, మరొక్కసారి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ కావాలని, అయితే ఈసారి తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: