భార్యభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటేనే ఎన్నేళ్లైనా ఆ బంధం నిలుస్తుంది. గొడవలు వచ్చినా సర్దుకుపోవడం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం వంటివి ఉంటేనే ఆ జంట కలకాలం వర్ధిల్లుతుంది. ఈ మధ్యకాలంలో రీమ్యారేజ్ అనే అంశం తెగ వైరల్ అవుతోంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకుని ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేముందో వ్యక్తపరచడం అన్నమాట. ఈ కల్చర్ విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు మన ఇండియాలోనూ మొదలైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ముచ్చటగా మూడోసారి తన భార్యను పెళ్లాడి మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాడు. రెమో బాలీవుడ్‌లో కెరీర్‌ను ఏర్పరచుకుంటున్న సమయంలో ఆయనకు లిజెల్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ దాదాపు 20 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. పెళ్లయ్యాక రెమో కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో రెమో వెన్నంటే ఉంటూ తోడుగా నిలిచింది లిజెల్. ఇటీవల వీరిద్దరూ తమ 20వ వెడ్డింగ్ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తమ పెళ్లి రోజునే చర్చిలో మరోసారి ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

వీరిద్దరు మాత్రమే కాదు త్వరలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు కూడా రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటానని షాహిద్ తనకు కొన్నేళ్ల క్రితమే ప్రామిస్ చేశాడని మీరా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భార్యైనా, భర్తైనా ఒకరిపై ఒకరు ప్రేమతో ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా ఫర్వాలేదు కానీ విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకుంటేనే సమస్య. ఏదైతేనేం రెమో తనకు భార్యపై ఎంత ప్రేముందో మరోసారి నిరూపిస్తూ ఇతర దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెమో బాలీవుడ్‌కు చెందిన టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరు. ప్రభుదేవా నటించిన ‘ఏబీసీడీ’ సినిమాకు రెమో దర్శకత్వం వహించారు. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుతో పాటు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: