మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆశించిన రేంజ్ లో హిట్ దక్కించుకోలేక ప్రస్తుతం యావరేజ్ టాక్ తో ముందుకు సాగుతోంది. అయితే ఆ సినిమా అనంతరం అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన నూతన సినిమాలో నటించనున్నారు. మొన్ననే అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

హీరోయిన్ మరియు ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యువ సంగీత తరంగం థమన్ ని ఎంపిక చేసినట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. తన కెరీర్లో తీసిన నాలుగు సినిమాలు కూడా దేవిశ్రీ సంగీత సారథ్యంలోనే పనిచేసిన కొరటాల, ఈ సినిమాకు మాత్రం తొలి సారి తమన్ ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి ఒక కారణం ఉందని అంటున్నారు, అదేమిటంటే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ తో ఎంతో బిజీగా ఉండటం, 

అలానే ఇప్పట్లో తన డేట్స్ ఖాళీ లేకపోవడంతో, ఆయన స్థానంలో వేరొక సంగీత దర్శకుడితో పని చేయాలని నిర్ణయించారట కొరటాల. కాగా ఉన్న వారందరిలోకి ఆకట్టుకునే మ్యూజిక్ తో మరియు వరుస అవకాశాలతో దూసుకుపోతున్న థమన్ అయితే తమ సినిమాకు కరెక్ట్ అని భావించిన కొరటాల, నేడు ఆయనను సంప్రదించి ఓకే చేసినట్లు చెప్తున్నారు. అదీకాక ఎప్పటినుండో ఏదైనా మంచి అవకాశం దొరికితే మెగాస్టార్ కూడా థమన్ తో కలిసి పనిచేయాలని చూస్తున్నారట. కాగా నేడు పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, థమన్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: