ఇండస్ట్రీలో ఎంత మంది యంగ్ హీరోలున్నా తన దూకుడు ముందు వారంతా బలాదూరేనని మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. తనపై ప్రేక్షకులకు అభిమానం తగ్గలేదని, తనలోని స్టామినా ఇంకా అయిపోలేదని ‘సైరా నరసింహారెడ్డి’ కలెక్షన్ల ద్వారా తెలియజెప్పారు. రేనాటి సూర్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఓ చారిత్రాత్మిక చిత్రంతో మెగాస్టార్ కొత్త చరిత్రను లిఖించారు. ప్రభాస్ మినహా ఏ హీరోకి సాధ్యం కాని ఫీట్‌ను చిరంజీవి అందుకున్నారు.

‘సైరా’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ.100 కోట్ల షేర్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. 11 రోజుల్లో అంటే శనివారం నాటికి రూ.97.65 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’.. ఆదివారం రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. శనివారం సుమారు రూ.3.5 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’.. ఆదివారం అంతకన్నా ఎక్కువే వసూలు చేసిందని అంటున్నారు. దీంతో అతి తక్కువ రోజుల్లో రూ.100 కోట్ల షేర్ సాధించిన నాన్-బాహుబలి మూవీగా ‘సైరా’ నిలిచినట్టయింది.

‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ వసూలు చేయడానికి 24 రోజులు పట్టింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ కేవలం 5 రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్యన ‘సైరా’ నిలబడింది. ‘సైరా’కు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ వసూలు చేయడానికి 12 రోజుల సమయం పట్టింది. దీంతో తెలుగు సినిమాలో తనకు తిరుగులేదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించుకున్నారు.

వాస్తవానికి ‘బాహుబలి’ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి కారణం రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఇమేజ్ కన్నా.. ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రభావం, రాజమౌళిపై ఉన్న నమ్మకం ‘బాహుబలి 2’కి అంత తక్కువ సమయంలో రూ.100 కోట్ల షేర్ వసూలయ్యేలా చేసింది. కానీ, ‘సైరా’ విషయంలో అలా కాదు. ఇది మెగాస్టార్ ఇమేజ్‌తో నడుస్తోన్న సినిమా. అందుకే, మెగాస్టార్ టాలీవుడ్‌లో తన పేరిట ఒక రికార్డును రాసి పెట్టేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: