రాబోయే 2020 సంక్రాంతి కానుకగా ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా, అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమాలు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అంతకముందు నెలైన డిసెంబర్ లో వచ్చే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈసారి బాగానే సినిమాలు విడుదల కానున్నాయి. నిజానికి ఈ సీజన్ లో ఎక్కువగా అక్కినేని వారి ఫ్యామిలీ నుండి మూవీస్ గతంలో ఎక్కువగా రిలీజ్ అయి మంచి విజయాలు అందుకునేవి. అయితే ఈ ఏడాది క్రిస్మస్ కు మాత్రం వారి ఫ్యామిలీ నుండి ఒక్కరి సినిమా కూడా బరిలో లేదు. 

అయితే ఈ క్రిస్మస్ బరిలో నిలుస్తున్న సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ మరియు మారుతీ కలయికలో రాబోతున్న ప్రతిరోజు పండగే, అనుష్క శెట్టి మరియు హేమంత్ మధుకర్ ల కాంబోలో రాబోతున్న నిశ్శబ్దం, నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ, అలానే రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు బాలయ్య మరియు కేఎస్ రవికుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా కూడా వీటితోపాటు పోటీలో నిలవనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాలన్నిటిపైనా కూడా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇటీవల చిత్రలహరితో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తేజ్, ఎలాగైనా ప్రతిరోజు పండగే సినిమాతో మరొక పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు. 

ఇక అనుష్క గతంలో భాగమతి సినిమాతో మంచి విజయం అందుకోగా, దీని ద్వారా మరొక విజయాన్ని ఆమె తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అయితే మాస్ రాజా రవితేజకు మాత్రం కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో, ఈసారి నటిస్తున్న డిస్కోరాజా తప్పకుండా మంచి హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక నితిన్ కూడా వరుసగా ఫ్లాప్స్ లో ఉండడంతో, వెంకీ తెరకెక్కిస్తున్న భీష్మ మంచి హిట్ కొట్టి, కెరీర్ పరంగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. గత ఏడాది తనకు జైసింహా వంటి హిట్ మూవీని అందించిన కేఎస్ రవికుమార్, తనకు ఖచ్చితంగా ఈ కొత్త సినిమాతో మరొక హిట్ ఇస్తారని బాలయ్య భావిస్తున్నారట. సో, ఈ క్రిస్మస్ కి రాబోతున్న ఈ సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: