మన  ప్రేక్షకులకు సూపర్ మ్యాన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన ఇండియన్ సినిమా ‘క్రిష్’. ‘కహోనా ప్యార్ హై’ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత హృతిక్ రోషన్‌కు విజయాన్నందించిన ‘కోయీ మిల్ గయా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టయింది. ఈ చిత్ర దర్శక నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్.. దీన్ని ఒక ఫ్రాంఛైజీగా మార్చాడు.


ఈ వరుసలో ‘క్రిష్-3’ తీసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా వచ్చి ఆరేళ్లవుతోంది. క్రిష్-4 గురించి హృతిక్, రాకేష్ ఊరిస్తూనే వచ్చారు. కానీ గత ఏడాది జరిగిన అనూహ్య పరిణామాలతో ఈ సిరీస్‌లో మరో సినిమా రాదనే నిరాశలోకి వెళ్లిపోయారు హృతిక్ అభిమానులు. రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడటంతో ‘క్రిష్’ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. రాకేష్ క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ ఇప్పుడిప్పుడే సినిమా తీసే స్థితిలో ఉండడని అంతా అనుకున్నారు.


కానీ రాకేష్ క్యాన్సర్ నుంచి త్వరగానే కోలుకున్నాడు. అంతే కాదు.. మళ్లీ సినిమా తీయడానికి కూడా రెడీ అయిపోయాడు. క్రిష్-4 సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని తాజాగా హృతిక్ కూడా ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్ ధ్రువీకరించాడు. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ‘వార్’తో లేటెస్టుగా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు హృతిక్. ఈ సినిమాతో అతడి మార్కెట్ పెరిగింది. దీంతో ‘క్రిష్-4’ బడ్జెట్ పెంచుకునే అవకాశం కూడా దక్కింది.


ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. ఎప్పట్లాగే రాజేష్ రోషన్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తాడట. ఆరేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. బడ్జెట్ పెంచుకునే సౌలభ్యమూ వచ్చింది. ఈసారి హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని యాక్షన్ థ్రిల్లర్ హృతిక్ నుంచి వస్తుందేమో.చూడాలి 
                             


మరింత సమాచారం తెలుసుకోండి: