‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు,
అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో ఛోటా కె. నాయుడు కెమెరా సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఛోటా కె. నాయుడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. తనకు చాలా కాలంగా ఓంకర్తో మంచి సాన్నిహిత్యం ఉందని.. ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడుకుంటామని.. ఈ క్రమంలోనే ‘రాజుగారి గది 3’ సినిమాకి పని చేయడానికి వెంటనే అంగీకరించానని చోటా చెప్పారు. అలాగే తను ఎక్కువగా కొత్త డైరెక్టర్లతో పని చెయ్యడానికి ఇష్టపడతానని వాళ్ళ ఆలోచనలు కొత్తగా ఉంటాయని వాళ్ళతో వర్క్ చెయ్యడం వల్ల తను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటానని అన్నారు. అలాగే నాతో పని చెయ్యడానికి చాలా మంది డైరెక్టర్లు భయపడతారని ఒకానొక సమయంలో వి.వి. వినాయక్ కూడా భయపడ్డారని చెప్పారు. మొదటి రెండు రోజులు షూట్ అయ్యాక మీరు వాటర్లాంటివారు ఎవరితోనైనా కలిసిపోగలరని అన్నారు.
ఇక ఈ సినిమా హీరో అశ్విన్ గురించి మాట్లాడుతూ, హీరోగా అశ్విన్ తన నటనతో తనను ఆశ్చర్యపరిచాడని.. ఖచ్చితంగా తను తన కెరీర్లో చాలా దూరం వెళ్తాడని ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో తక్కువ హర్రర్ ఎక్కువ కామెడీ ఉంటుందని చోటా చెప్పుకొచ్చారు. అలాగే హీరోయిన్ అవికాగోర్ అని చెప్పినప్పుడు అవికా మీద కూడా పెద్దగా నాకు నమ్మకం కుదరలేదు. ఆ తర్వాత క్లైమాక్స్లో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్యర్యపోయాను. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఫ్యానయిపోయాననే చెప్పాలి.