తన నలభై రెండు ఏళ్ల నట జీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఈ సినిమాలో సోడాల రాజు పాత్రలో నటించా. 5 పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తు చేసింది అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్,
వెన్నెల కిశోర్, హర్షిత ముఖ్య తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ చిత్రం నవంబర్లో విడుదల అవుతోంది.
హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమేం చేశాం? మన మూలాలు ఏంటి? అని తెలియజెప్పడానికైనా ఓక మంచి సినిమా ఉండాలి అని అన్నారు. ఆ లోటును తీర్చే సినిమా తోలుబొమ్మలాట అని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కథని యాభై సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు చేయాలి. కానీ, విశ్వనాథ్ వంటి కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ నలుగురు సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నాను. కానీ ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ తోలుబొమ్మలాట.
తన నటజీవితంలో మరుపురాని సినిమా ఈ తోలుబొమ్మలాట అని అన్నారు. ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్గారి దగ్గరకు వెళ్లినపుడు ఓ గురువులా నన్ను ప్రోత్సహించారు అన్నారు సినిమా దర్శకుడు విశ్వనాథ్ మాగంటి. కుటుంబ భావోద్వేగాలతో ఉన్న ఈ సినిమా తెరకెక్కింది అని అయన తెలిపారు.
ఈ చిత్రంలో సోడాలరాజు స్నేహితుని పాత్ర చేశాను అన్నారు సీనియర్ నటుడు నారాయణరావు. నటుడు దేవీప్రసాద్, పాటల రచయిత చైతన్యప్రసాద్, హీరోయిన్ హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీతదర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నూకవల్లి, ఆర్ట్డైరెక్టర్ మోహన్ కె.తాళ్లూరి తదితరులు ఈ కార్యక్రంలో పాల్లొన్నారు.