అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చిన భామ షాలినీ పాండే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం వల్ల ఆమెకు అవకాశాలు బాగానే వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చిన్న చితకా పాత్రలు తప్ప హీరోయిన్ గా వచ్చిన అవకాశాలు తక్కువ. అర్జున్ రెడ్డి తర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన సినిమా ఒక్కటే. కళ్యాణ్ రామ్ తో 118 సినిమాలో హీరోయిన్ గా ఆమె కనిపించింది.


ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలేం లేవు. తెలుగును పక్కన పెడితే, తమిళంలో ఆమె నటించిన ౧౦౦% కాదల్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. తమిళంలో మరికొన్ని చిత్రాలకు సైన్ చేసింది. అయితే అవి ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె ముంబయి వెళ్ళిపోయిందట. ఆమె మేనేజర్ కి సైతం అందుబాటులో ఉండట్లేదట. దానికి కారణం ఏంటా ఆరా తీస్తే, ఆమెకు బాలీవుడ్ లో బడా సినిమాలో ఆఫర్ వచ్చిందని సమాచారం.


అందుకే ఎవరికీ చెప్పకుండా తెలివిగా ముంబయి చెక్కేసిందట. అయితే ముంబయి కొత్త పీఆర్ టీం ని కూడా సెట్ చేసుకుందట. దీంతో ఆమెతో చిత్రం చేయాలనుకున్న నిర్మాతలు ఆమె ప్రవర్తన పట్ల మండిపడుతున్నారు. ఆమెకు బాలీవుడ్ చిత్రం అంత ముఖ్యం అయినపుడు ఇక్కడ సినిమాలు ఎందుకు ఒప్పుకుందని విమర్శిస్తున్నారు. అయితే ఆమెపై సదరు నిర్మాతలు మొండిపట్టుతో ఉన్నారట. 


ఎలాగైనా వారి సినిమాలు చేయించుకోవాలని చూస్తున్నారట. అందుకని ఆమె మీద నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది షాలినీ పాండేని తప్పుబడుతున్నారు. తనకి హిందీ చిత్రం ముఖ్యమే కావచ్చు. కానీ అంతకంటే ముందు ఒప్పుకున్న సినిమాలని కంప్లీట్ చేయాలి అని అంటున్నారు. మరి వీటన్నింటి పట్ల షాలినీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.







మరింత సమాచారం తెలుసుకోండి: