చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. విడుదలైన ప్రతి చోటా లాభాల బాట పట్టేందుకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా ఇప్పటికీ మంచి కలెక్షన్లనే రాబడుతోంది. అయితే, ‘సైరా’ ప్రదర్శితమవుతోన్న థియేటర్లపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. ఆయా రంగాల నుంచి తమకు రావాల్సిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. సినిమా రంగానికి కూడా జీఎస్టీ వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమాను ప్రదర్శించే బయ్యర్లు జీఎస్టీని తూచా తప్పకుండా చెల్లించాలి. ప్రస్తుతం ‘సైరా’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. కాబట్టి, జీఎస్టీని పక్కాగా చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు.


తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో  జీఎస్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. లెక్కలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆయా థియేటర్లలో పరిశీలించారట. అయితే, అధికారులకు అక్కడ ఎలాంటి సమాచారం లభించింది, లెక్కల్లో తేడాలు ఏమైనా ఉన్నాయా? వంటి విషయాలు తెలియరాలేదు. 


ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ‘సైరా’ను నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకొని విక్రయించారు. ఈ ఒప్పందం ప్రకారం కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ ఫిగర్‌ను దాటేంత వరకు నిర్మాత రామ్ చరణ్ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. సినిమా లాభాల బాట పట్టిన దగ్గర నుంచి బయ్యర్లు జీఎస్టీని చెల్లిస్తారు. ప్రస్తుతానికి నైజాం, ఉత్తరాంధ్రలో ‘సైరా’ బ్రేక్ ఈవెన్ ఫిగర్‌ను దాటేసింది. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ వసూలు చేసింది. కాబట్టి, జీఎస్టీ కింద రామ్ చరణ్ పెద్ద మొత్తంలోనే చెల్లించి ఉంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: