తమిళ తెలుగు నాట త్రిష జోరు తెలియని వారు లేరు. హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఈ రెండు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఆమె సాగించిన హవా కుర్రకారు అంత తేలికగా మర్చిపోయేది కాదు. నటి సిమ్రాన్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అంత పేరు త్రిషకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. కానీ పాపం ఈ పేరు ఈమె ఎక్కువ కాలం నిలుపుకోలేకపొయింది. మొదట వరుస సినిమాలతో విజయం సాధించిన తర్వాత మాత్రం అంతగా అవకాశాలు ఈమెని వరించలేదు. 

 

కాజల్, తమన్నా, సమంత వంటి తారలు ఇచ్చిన గట్టి పోటీని ఈమె తట్టుకోలేకపోయింది. అప్పటి ఆమె డౌన్ ఫాల్ చూసి ఇండస్ట్రీకి దూరమవుతుందనుకున్నారు.ఇక అదే సమయంలో పెళ్లికి రెడీ అవడంతో ఇక ఆమె కెరీర్ కి శుభం కార్డ్ పడింది. కానీ అంతలోనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని సినిమాల్లో నటించేందుకు నిర్ణయించుకున్న త్రిష.. మళ్లీ తన అవకాశాలను అందుకుంది.

 

గత ఏడాది ‘96’ సినిమాతో సూపర్ బౌన్స్ బ్యాక్ అయిన త్రిషకు.. ఇప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు వరిస్తున్నాయి. ఓవైపు తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న త్రిష.. మరోవైపు మలయాళంలో మోహన్ లాల్‌కు జంటగా ఓ సినిమా తీస్తుంది. ఇక ఈ సమయంలో తెలుగు నుంచి మరో పెద్ద అవకాశం ఈమెకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

సైరా సినిమా తర్వాత చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రంలో త్రిషను ఓ కథానాయికగా ఎంచుకున్నారట. ఇదే నిజమైతే ‘స్టాలిన్’ తర్వాత చిరుతో త్రిష జోడీ కట్టబోయే సినిమా ఇదే కదా. అప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉండగా చిరు పక్కన నటించడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు కెరీర్ ముగిసే దశలో చిరుతో జోడీ కట్టడం మాత్రం విశేషమే. 35వ పడికి చేరువ అవుతూ.. మూడు భాషల్లో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం త్రిష కెరీర్లో గొప్ప ట్విస్ట్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: