కోలీవుడ్ టాప్‌ స్టార్‌ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బిగిల్‌. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తేరి (తెలుగులో పోలీస్‌), మెర్సల్‌ (తెలుగులో అదిరింది) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సస్ ను సాదించటంతో ఇప్పుడు బిగిల్‌ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండగా రీసెంట్‌గా ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత, దర్శకుడు తెలంగాణ రచయితల సంఘంలో కంప్లయింట్ చేశాడు. తెలుగులో పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసిన దర్శకుడు నంది చిన్ని కుమార్‌ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు బిగిల్ చిత్రయూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతను అంటున్నాడు.

అయితే తన కథను పూర్తిగా బిగిల్ యూనిట్ తీసుకోలేదని, కథలోని మెయిన్‌ పాయింట్‌ మాత్రమే తీసుకొని వారు కథా కథనాలు సిద్ధం చేసుకున్నారని ఆరోపిస్తున్నాడు. దాంతో చిన్న కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తెలంగాణ రచయిత సంఘం విచారణ చేపట్టారు. ఇదే కాదు బిగిల్‌ సినిమా తమిళనాడులోనూ ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది. దర్శకుడు కేపీ సెల్వ కూడా బిగిల్‌ కథ నాదే అంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇలాంటి వివాదాలు విజయ్‌కి కొత్త కాదన్న విషయం కూడా తెలిసిందే. దాదాపుగా విజయ్‌ చేసిన సినిమాలన్నీ చాలా కాలంగా రిలీజ్‌కు ముందు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాయి. 

ముఖ్యంగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విజయ్‌ సినిమాలు రిలీజ్‌ విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాయి. విజయ్‌ నటించిన సర్కార్‌ కూడా రిలీజ్‌ కు ముందు ఇలానే కాపీ వివాదాలాను ఎదుర్కొంది. అయితే రిలీజ్‌ విషయంలో అడ్డంకులు ఉండొద్దన్న ఉద్దేశంతో చిత్రయూనిట్ చర్యలు తీసుకోవటంతో సర్కార్‌ అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగిల్‌ ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందని విజయ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఇక విజయ్‌ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఏజీఎన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాను తెలుగులో విజిల్‌ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: