దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇకపోతే ఈ కథ పూర్తిగా కల్పితమేనని దర్శకుడు రాజమౌళి గతంలో మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక 1920 కాలంలో అల్లూరి, కొమురం భీం ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారనేది చరిత్రలో నమోదు కాలేదని, ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేదనే దాన్ని ఊహించి ఈ కథను తయారు చేశామని రాజమౌళి వెల్లడించారు.
అయితే శరవేగంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని.. కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. వీరిద్దరికీ ఎలా స్నేహం ఏర్పడిందో చరిత్రలో ఎక్కడా లేదని, చరిత్రలో లేని విషయాలతో చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన అన్నారు.
చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు. నర్సీపట్నంతో అల్లూరికి వీడదీయలేని అనుబంధం ఉందని, భవిష్యత్తులో అల్లూరి జిల్లా ఏర్పాటు చేస్తే నర్సీపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు పేర్కొన్నారు.
ఇకపోతే బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ సీనియర్ యాక్టర్ సముద్రఖని నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఎంపికవ్వగా, ఎన్టీఆర్కు జోడిగా విదేశీ భామను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.