బాలీవుడ్ కండల వీరుడిగా అలానే అభిమానులు ముద్దుగా సల్లు భాయి అని పిలుచుకునే సల్మాన్ ఖాన్, ఇటీవల వరుస విజయాలతో దూసుకువెళ్తున్నారు. టైగర్ జిందా హై, సుల్తాన్, భారత్ వంటి సినిమాలతో భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న సల్మాన్, తనకు బాగా కలిసి వచ్చి ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టిన దబాంగ్ సిరీస్ లోని మూడవ సినిమాలో ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. దబాంగ్ 3 పేరుతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఆడియన్స్ యొక్క అత్యద్భుతమైన రెస్పాన్స్ మరియు అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలలో భాగంగా ఫ్యాన్స్ మరియు మీడియా మిత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సల్మాన్ ఖాన్

తనకు ఎంతో గుర్తింపునిచ్చిన దబాంగ్ రెండు భాగాల్లోని చుల్ బుల్ పాండే అనే పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టం అని, అందుకే ఇటీవల ప్రభుదేవా తో కలిసి చర్చించి ఈ దబాంగ్ 3 సినిమా కథను సిద్ధం చేసి యాక్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇక మొదటి రెండు భాగలను మించే విధంగా ఈ మూడవ భాగం ఉంటుందని చెప్పిన సల్మాన్, కొందరు తెలుగు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తనకు తెలుగు ప్రేక్షకులు అంటే ఎంతో ఇష్టం అని, అతి త్వరలో తాను హైదరాబాద్ వచ్చి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని కలవబోతున్నానని ఒక సెన్సేషనల్ న్యూస్ ని చెప్పడం జరిగింది. సల్మాన్ చెప్పిన ఆ విషయంతో ఫ్యాన్స్ విపరీతంగా కేరింతలు మరియు చప్పట్లతో హోరెత్తించారు. 

అయితే సల్మాన్ చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చలకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు పలువురు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో పని చేసి సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్, హిందీలో కొన్నేళ్ల క్రితం ఏకంగా బిగ్ బి అమితాబ్ హీరోగా బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమాను తీసి మంచి హిట్ కొట్టడం జరిగింది. అయితే అప్పటి నుండి పూరితో ఒక్క సినిమా అయినా చేయాలని భావించిన సల్మాన్ ఖాన్, ఎట్టకేలకు పూరి దగ్గర ఒక కథ ఉండడంతో, అది వినడానికి హైదరాబాద్ వస్తున్నారని టాక్. అంతేకాక, ఆ కథ సల్మాన్ కు సరిగ్గా సరిపోతుందని, దానితో పూరి ఆయనతో కలిసి సినిమా తీయడం ఖాయమని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: