ప్రముఖ నటుడు కమలహాసన్ కు షూటింగ్‌లో ప్రమాదం కారణంగా గాయాలు అయ్యాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ షూటింగ్ రద్దయింది అని న్యూస్. కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఉత్తమవిలన్’ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరలో విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమాదం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి అని యూనిట్ వర్గాల టాక్. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు అని తెలుస్తోంది. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్‌కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని దర్శకుడు చెపుతున్నాడు. కమల్ నిర్మించిన ‘విశ్వరూపం-2’ సినిమా పూర్తి అయినా ఆ సినిమా విడుదలకు ఆర్ధిక సమస్యలు అడ్డు రావడంతో ‘విశ్వరూపం-2’ కన్నా ముందుగా ఉత్తమ విలన్ విడుదల చేయాలని కమల్ పట్టుదలతో ఉన్నాడు. అయితే అనుకోని ఈ అవాంతరం వల్ల ఈ ‘ఉత్తమ విలన్’ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: