భారత దేశంలో ఉన్నత విద్య అభ్యసించడాని, ఉన్నత విద్య తర్వాత మంచి ఉద్యోగంలో జాబ్ చేయడానికి చాలా మంది అమెరికా బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని సార్లు విషాద సంఘటనలు చోటు చేసుకోవడంతో ఎక్కడో పుట్టి ఎక్కడో చనిపోవడం అనేది కుటుంబ సభ్యుల హృదయం కలిచి వేస్తుంది. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్యకోసం వెళ్లిన తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్న తెలుగు విద్యార్థి రాచమల్ల విక్రమ్గౌడ్(24) రోడ్డు ప్రమాదంలో బలయ్యాడు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నివాసముండే విక్రమ్ నగరంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు.
అనంతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. తరువాత డిసెంబర్ 31న కాలిఫోర్నియాలోని సిలికాన్వ్యాలీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు అక్కడికి వెళ్లాడు. గత శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో వీరందరూ తిరిగి వస్తుండగా కారుకు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి రావడంతో కారు నడుపుతున్న విక్రమ్ గౌడ్ స్నేహితుడు సడన్ బ్రేక్ వేశాడు.
వెంటనే కారు ఫల్టీలు కొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది..వెనుక సీట్లో కూర్చున్న విక్రమ్ గౌడ్ మరణించినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అమెరికా అధికారులు మృతదేహాన్ని పంపుతున్నట్టు తెలిపారు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన కొడుకు శవమయ్యాడని తెలిసి విక్రమ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.