పెళ్లి చేసుకున్నారు.. ఒకటయ్యారు. కానీ వేరుగా ఉంటున్నారు. విషయం ఏంటంటే.. భర్త సౌదీలో పనిచేస్తున్నాడు. కానీ భార్య స్వదేశంలో ఉంటుంది. ముచ్చటపడి విజిటింగ్‌ వీసాపై భార్యను గల్ఫ్‌కు తీసుకొచ్చాడు. భార్య గల్ఫ్‌ కు రావటం ఆ తెలంగాణ ప్రవాసీయుడికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. నెలలు నిండకుండానే ఆమెకు ప్రసవం అయింది. ఆమెకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఆ ఆసుపత్రి బిల్లు రూ.5 కోట్లయింది. అంత బిల్లు నినేక్కడ చెల్లించేదంటూ.. ఆ భర్త లబోదిబోమంటున్నాడు. 
బాధితుడు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్‌ జహీద్‌. అతడు కొంతకాలంగా సౌదీలో పనిచేస్తున్నాడు. విజిటింగ్‌ వీసాపై ఏడాది క్రితం భార్యను సౌదీకి తీసుకొచ్చాడు. అక్కడే ఆమె గర్భం దాల్చింది. ఏడోనెలలోనే నొప్పులు రావడంతో రియాద్‌లోని సులేమాన్‌ హబీబ్‌ ఆసుపత్రిలో చేర్పించాడు.
 
అక్కడ ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆసుపత్రి ఖర్చుల కోసం దాచుకున్న రూ.4.31లక్షలను జహీద్‌ చెల్లించాడు. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వలన డాక్టర్స్ ఇన్‌క్యూబెటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు ప్రతి శిశువుకు రోజుకు 10వేల రియాళ్ల చొప్పున ఖర్చవుతోంది. అంటే.. రోజుకు నలుగురు పిల్లలకు కలిపి రూ.7లక్షలు ఖర్చవుతోంది. మరో రెండు నెలలయినా పిల్లలను ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయాల్సి ఉందని.. ఆ రకంగా వారికి రూ.4.50 కోట్లు ఖర్చవుతుందని.. దీనికి మందుల ఖర్చు అదనమని వైద్యులు సూచించారు. పాపం.. జహీద్‌ అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సాయం కోసం అర్థిస్తున్నాడు. 
తన భార్య గర్భవతి అని తెలియగానే స్వదేశానికి పంపాలని అనుకున్నానని, అయితే ఎయిర్‌లైన్స్‌ అధికారులు అనుమతించలేదని.. దీంతో ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని వాపోయాడు. ఇటీవల ఏడాది, రెండేళ్ల కోసం విజిటింగ్‌ వీసాలను సౌదీ ప్రభుత్వం ఉదారంగా జారీచేస్తోంది. దీంతో ఈ వీసాల ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి పెళ్లయిన జంటల రాక పెరిగింది. ఈ క్రమంలోనే జహీద్‌ జంట ఇక్కడే కాపురం చేసి చిక్కుల్లో పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: