21 శరీరాలు బీచ్ లో మాయమయ్యాయి. వారు చనిపోయినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే 21 మంది కాళ్లు మాత్రమే కనిపించాయి. శరీరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ అసలు ఆ బీచ్‌లో ఏం జరుగుతోంది. ప్రజలను వణికిస్తున్న ఆ బీచ్ ఎక్కడుంది? తీరానికి కొట్టుకొస్తున్న ఆ కాళ్లు ఎవరివీ? పోలీసులు ఆ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఒక మిస్టరీగా మారాయి. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా, అమెరికాలోని వాషింగ్టన్ మధ్య సలిష్ సముద్రం తీరం పేరు వింటే చాలు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 

 

బీచ్ లో దశాబ్ద కాలంగా జరుగుతోన్న మారణకాండ అందరినీ వణికిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న జెట్టీ ఐల్యాండ్‌ తీరానికి షూ కొట్టుకొచ్చింది. ఆ షూలో మనిషి పాదాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాదాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు జరపగా 2016, డిసెంబరు 12 నుంచి ఆచూకీలేని ఆంటోనియో నిల్‌ అనే వ్యక్తిదని తెలిసింది. సలిష్ సముద్రంలో తొలి ఘటన 1887లో చోటుచేసుకుంది. ఆ తర్వాత 1914లో మరో పాదం కూడా అలాగే దొరికింది. 2007 నుంచి తీరానికి మనుషుల కాళ్లు, పాదాలు కొట్టుకురావడం పెరిగింది. సలిష్ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న వివిధ ప్రాంతాలకు ఆ కాళ్లు కొట్టుకొచ్చేవి. 2007లో రెండు, 2008లో ఐదు, 2009లో ఒకటి, 2010లో రెండు, 2011లో మూడు, 2012లో ఒకటి, 2014లో ఒకటి, 2016లో రెండు, 2017లో ఒకటి, 2018లో రెండు, 2019లో ఒకటి చొప్పున కాళ్లు, పాదాలు కొట్టుకువచ్చాయి. 


 తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పోలీసులు సైతం ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టినా నిందితులను పట్టుకోలేకపోయారు. బాధితుల ఆచూకీ కనుగోలేకపోయారు. ఇక్కడ లభించిన అన్ని కాళ్లకు షూలు ఉండటం గమనార్హం. పోలీసులు దీనిపై వివరణ ఇస్తూ సలిష్ సముద్రంలో ఆత్మహత్య చేసుకునేవారు, వివిధ ప్రమాదాల్లో మరణించేవారి పాదాలు తీరానికి కొట్టుకొస్తున్నట్లు తెలిపారు. అయితే, శరీరాలు కాకుండా కేవలం పాదాలు, కాళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకొస్తున్నాయనే విషయానికి మాత్రం పోలీసులు జవాబు చెప్పలేకపోతున్నారు. అయితే, సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ రీసెర్చ్‌ కో-డైరెక్టర్ గెయిల్ అండర్సన్ స్పందిస్తూ.. ‘‘నీళ్లలో ఉండే శరీరాల్లో కాళ్లు, చేతుల భాగాలు సున్నితంగా ఉంటాయి. అయితే, పాదాలకు షూలు ధరించడం వల్ల అవి ఎక్కువగా ప్రవాహ తాకిడికి గురవ్వుతాయి. దీనివల్ల షూలతో సహా కాళ్లు, లేదా పాదాలు శరీరం నుంచి వేరవుతాయి. లేదా సముద్రంలో ఉండే జీవుల దాడి వల్ల పాదాలు ఊడిపోయే అవకాశాలున్నాయి. సలిష్ తీరానికి కొట్టుకొచ్చిన అన్ని కాళ్లకు షూలు ఉండటాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది’’ అని తెలిపారు. 


 చనిపోయివారు ఎవరు? ఎక్కడివారనే వివరాలు మాత్రం ఇంకా అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయాయి. మిస్టరీని ఛేదించేందుకు పోలీసు సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస సంఘటనలో బీచ్ పరిసర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ కథకు ఎప్పుడు ముగింపు వస్తుందో ఎదురుచూడాల్సిందే మరి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: