ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యాధి కరోనా. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. చైనాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో దీని బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 260 మంది మృతిచెందగా.. మరో 12వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వుహాన్ ప్రావిన్స్లో ఉన్న 400 మంది భారతీయులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని అభ్యర్థించడంతో వారికోసం భారత్ ప్రత్యేక విమానాలను పంపిన విషయం తెలిసిందే.
324 మందితో కూడిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుపతిలోని టీసీఎల్ సెల్ కంపెనీకి చెందిన 58 మంది ఎంప్లాయిలు గతేడాది ఆగస్టులో శిక్షణ కోసం చైనాకు వెళ్లారు. ఇందులోని 56 మంది అందరూ సేఫ్గా ఉన్నామని వీడియో కూడా రిలీజ్ చేశారు. వీరందరూ శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో రాగా, ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరిలో కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం బిజివేములకు చెందిన అన్నెం శ్రుతి ఒకరు. ఆమెకు 99.5 ఫారిన్హీట్ జ్వరం ఉందన్న కారణంతో శుక్రవారం వుహాన్ నుంచి బయలుదేరిన విమానంలోకి అనుమతించలేదు. శ్రుతి తాను ఎదుర్కొంటున్న కష్టాలను వీడియో కాల్ ద్వారా తన తల్లి, బంధువులకు వివరించారు.
తనతోపాటు విమానం ఎక్కించుకోడానికి నిరాకరించిన మరొకరిని చెరోచోట ఉంచారని.. తినడానికి ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శ్రుతి వివాహానికి ఫిబ్రవరి 14న ముహూర్తం నిర్ణయించారు. అయితే, అనుకోకుండా ఆమె చైనాలో చిక్కుకుపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తన కుమార్తెను అక్కడ నుంచి తీసుకురావాలని తల్లి ప్రమీలాదేవి విజ్ఞప్తి చేశారు.