ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారితో గడ గడ వణికి పోతున్నారు. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 24.9 లక్షలు కాగా, ఒక్క అమెరికాలోనే 7.99 లక్షల కేసులు నమోదయ్యాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అగ్రరాజ్యంలో 42,897 మరణాలు సంభవించాయి. అయితే కొన్నిరోజులుగా పరిస్థితి అదుపులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికాలో కరోనా వైరస్ బారినపడిన వారికి స్వస్థత చేకూర్చేందుకు ఎంతో సేవ చేస్తున్న భారత సంతతి మహిళ డాక్టర్ ఉమా మధుసూదన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
మైసూర్ ప్రాంతానికి చెందిన ఉమా మధుసూదన్ కొంత కాలంగా అమెరికాలోని సౌత్ విండ్సార్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని వైద్య బృందం ఎంతో మంది కరోనా పాజిటివ్ లను నెగటివ్ లుగా మార్చింది. ఆమె చేసిన సేవలకు గాను అధికారులు ఆమె సేవలను కొనియాడుతూ ఆమె ఇంటి ముందు వాహనాల పరేడ్ ను నిర్వహించారు. ఆమె ఉంటున్న ఇంటి సమీపం నుంచి 100 వాహనాలను తీసుకుని వచ్చి నిలిపారు.
వీటిల్లో పోలీసు, అగ్నిమాపక, ఇతర అధికారుల వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మీ సేవలకు ధన్యావాదాలు అంటూ అక్కడ ఓ పోస్టర్ కూడా పెట్టారు.. ఆ వాహనాలను చూసిన ఉమా మధుసూదన్ సైతం పట్టలేని ఆనందంతో వారికి చేతులు ఊపుతూ థ్యాంక్యూ.. థ్యాంక్యూ అన్నారు. సుమారు ఆరున్నర నిమిషాల నిడివివున్న ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మన దేశంలో కూడా డాక్లర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు చేస్తున్న సేవలకు గాను వారికి ఎంతో గౌరవం దక్కుతుంది.. సమాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వారి సేవలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.