అమెరికాలోని ఫ్లోరిడాలో మరో దారుణం జరిగింది. గత కొంత కాలంగా అమెరికాలో తెలుగు వారిపై వరుసగా దాడులు, హత్యల పరంపర కొనసాగుతుంది. తాజాగా తెలంగాణకు చెందిన గోవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్మెంటల్ స్టోర్లో మేనేజర్గా పని చేస్తోన్న కొత్త గోవర్ధన్ రెడ్డితోపాటు మరో వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికి అక్కడే చనిపోయారు. గాయాల పాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఏనిమిదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా గోవర్ధన్ రెడ్డి అమెరికా వెళ్లారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గం.లకు స్టోర్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. మరో గంటన్నరలో స్టోర్ మూసేసి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గత ఏడాది నవంబర్లో అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు.
మెదక్కు చెందిన సునీల్ ఎడ్లాను వెంట్నార్ సిటీలో ఆయన ఇంటి ముందే 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గోవర్ధన్ రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటున్నారు. ఆయన మృతి విషయం తెలిసి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.